ఎల్లారెడ్డి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి మోడేగాం మహేష్
ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మదన్ మోహన్ రావుకే తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఎల్లారెడ్డి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి మోడెగాం మహేష్ తెలిపారు. రామారెడ్డి మండల కేంద్రంలో భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ మాట్లాడుతూ.. తెలంగాణలో అనివార్య కారణాల వల్ల ఎన్నికల్లో పోటీకి తమ పార్టీ యూటర్న్ తీసుకుందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థికే తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కరోన లాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్న మదన్ మోహన్ రావుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి భరోసా ఇచ్చారన్నారు. సదశివనగర్ మండలానికి చెందిన చాకలి సాయిలు అనే టిడిపి కార్యకర్తకు బిసి బంధు వస్తే కండువా మారిస్తేనే బిసి బంధు ఇస్తామని చెప్పడం సరికాదని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. మదన్ మోహన్ రావుకు టీడీపీ మద్దతు ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చందాలు వేసి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అమ్ముడుపోయిన ఎమ్మెల్యే సురేందర్ ను ఓడించి బుద్ది చెప్తామన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి