వరుసగా రెండోసారి నగర ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన నగర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు అన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలోని పలువురు ప్రముఖులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, వ్యాపార సంస్థ నిర్వాహకులు షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులను కలుసుకుని అభినందనలు తెలిపారు.
పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ముందుగా పవర్ పేట లోని వాసు దేవాలయంలో నూర్జహాన్ పెదబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తన విజయానికి కారణమన్నారు.
ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సారథ్యంలో నగరాన్నిఅభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. నగరపాలక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మెజార్టీని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కార్పొరేటర్లు భీమవరపు హేమసుందరి సురేష్, డింపుల్ రుషి, సబ్బన శ్రీనివాసరావు, అర్జీ నాగేశ్వరరావు సత్యవతి, ఎర్రంశెట్టి నాగబాబు, పప్పు ఉమామహేశ్వరరావు, తుమరాడ శ్రవంతి,ఆరేపల్లి రాధిక, జున్నూరు కనక నరసింహారావు, ఆర్యవైశ్య సంఘం నాయకులు అంబికా రాజా, మార్కెట్ యార్డ్ వ్యాపారుల సంఘం నాయకులు, పలువురు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది, శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.