రీజినల్ పాలిటెక్ ఫెస్ట్ – 2022 ప్రారంభంలో కలెక్టర్ సూర్యకుమారి..
పాలిటెక్నిక్ కోర్సుల ద్వారా యువతకు తక్షణ ఉపాధి లభిస్తుందని, థియరీ కంటే ప్రాక్టికల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటమే దీనికి కారణమని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఇక్కడ నేర్పించే లైఫ్ స్కిల్స్ జీవితంలో త్వరగా స్థిరపడేందుకు దోహదపడతాయని అన్నారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఉండే కరిక్యులమ్ వల్ల విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నగరంలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించబోయే రీజినల్ పాలిటెక్ ఫెస్ట్ – 2022 కార్యక్రమాన్ని బెలూన్ల ఎగురవేయటం ద్వారా మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రావణి, కళాశాల ప్రిన్సిపాల్ ఆశా రమణిలతో కలిసి కలెక్టర్ సూర్యకుమారి ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఉండే పాలిటెక్నిక్ వంటి కోర్సుల ద్వారా త్వరితగతిన ఉపాధి లభిస్తుందని, ఇక్కడ నేర్పించే అంశాలను మనసు పెట్టి నేర్చుకొని జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తమ ఇంజనీర్లు కావడానికి పాలిటెక్నిక్ ఒక చక్కని వేదిక అని పేర్కొన్నారు. ఇలాంటి టెక్ ఫెస్ట్లను సద్వినియోగం చేసుకోవాలని, సమాజానికి ఉపయోగపడే మంచి మానవ వనరుగా తయారు కావాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
యువతకు సామాజిక సృహ కూడా ఉండాలని, రాజకీయ అంశాల్లో పరిజ్ఞానం కూడా ముఖ్యమే అని పేర్కొంటూ విద్యార్థులు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలకు ఇద్దరు బీఎల్వోలను పంపించి ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అక్కడ నుంచే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి రావాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఫెస్ట్ లో భాగంగా జిల్లాలోని 22 ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల విద్యార్థులు వివిధ వైజ్ఞానికి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పవర్ మేనేజ్మెంట్ సిస్ట్ం, సోలార్ సిస్ట్ం, వర్షపు నీరు పొదుపు, సైక్లింగ్ ద్వారా విద్యుత్ ఉత్తత్తి తయారు చేయుట వంటి పలు అంశాలపై విద్యార్థులు ప్రయోగాత్మక ప్రదర్శనలు చేశారు. వైజ్ఞానికి ప్రదర్శనలను కలెక్టర్ సూర్యకుమారి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి లాంఛనంగా ప్రారంభించి తిలకించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, రెండో డివిజన్ కార్పొరేటర్ సత్య గౌరి, కళాశాల ప్రిన్సిపాల్ జె. ఆశా రమణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.