కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల పరిధిలోని అమరవరం గ్రామంలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించి వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ దళితులను, గిరిజనులను టార్గెట్ చేసి తినే ఆహార పదార్థాల మీద,చేసుకునే సాగు భూముల మీద దృష్టి పెట్టి లాకుంటుందన్నారు. భూమి లేని నిరుపేదలు ఉపాధి మీద ఆధారపడి జీవిస్తున్నారని, గత పాలకులు 15 లక్షల కోట్ల బడ్జెట్ లో లక్ష కోట్లు ఉపాధి కేటాయిస్తే నేటి బిజెపి ప్రభుత్వం 40లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం 73 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి పేదలకు ఉపాధి కూలీలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు.
ఉపాధి అవకాశాలు తగ్గిస్తున్న ప్రభుత్వాలు
ఒకవైపు కరోనా తో పరిశ్రమలు మూతబడి అనేకమంది యువకులు ఉపాధి లేక ఉపాధి కోసం చూస్తుంటే బడ్జెట్లో మూడు లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా గత బడ్జెట్ ను కూడా తగ్గించి ఉపాధి లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. దళితులకు,గిరిజనులకు,పేదలకు తీవ్ర అన్యాయం బడ్జెట్ లో చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్,డీజిల్ వంట గ్యాస్ రేట్లు పెంచటం మూలంగా అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగి పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేరళ తరహాలో రేషన్ షాపుల ద్వారా 17 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు.ఉపాధి కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరంలో 200 రోజులు పనులు చూపించాలని,పని ప్రదేశాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.దేశ వ్యాప్తంగా కూలీల కోసం సమగ్ర కూలి చట్టం తేవాలని,కూలి బంధు,కూలి భీమా పథకాలను కేంద్ర ప్రభుత్వమే తెచ్చి దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చినా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. దళితులకు,గిరిజనులకు మూడెకరాల భూమి,57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్,వితంతువుల పెన్షన్ ఇవ్వాలని, నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూలీలందరి కూలి భీమా అమలు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి దరఖాస్తులు తీసుకున్న ముఖ్యమంత్రి నేటికీ హక్కు పత్రాలు ఇవ్వక పోవడం తీవ్ర అన్యాయం అన్నారు. వెంటనే హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. నీళ్లు,నిధులు, కొలువులు ఇచ్చి బంగారు తెలంగాణగా తయారు చేస్తామని ముఖ్యమంత్రి హామీలు ఒట్టి నీటి ముటలేనీ విమర్శించారు.
దళితులకు,గిరిజనులకు భూమి ఇవ్వకపోగా స్మశాన వాటికలు,రైతు వేదికలు,ప్రభుత్వ కార్యాలయాల పేరుతో వారి భూములను గుంజుకుని అన్యాయం చేస్తున్నారని అన్నారు. పోరంబోకు, పంచ రాయి,ప్రభుత్వ భూములను,పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ సొంత స్థలం ఉన్నచోట ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని,స్థలం లేని వారికి ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని,తెల్ల రేషన్ కార్డు అర్హులందరికీ ఇవ్వాలని, దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక దళిత గిరిజన గ్రామాల్లో మంచినీళ్లు, రోడ్లు సమస్యలు ఉన్నాయని,వాటిని పరిష్కరించాలని,గ్రామాల్లో మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోషణ బోయిన హుస్సేన్,మండల నాయకులు షేక్ సైదా, ఎన్నం కృష్ణారెడ్డి,బుద్ధి బాల సైదులు,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్