క్రొత్తగా అటవీ భూముల ఆక్రమణ, పోడు వ్యవసాయానికి అనుమతించేది లేదని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో రెవిన్యూ, పోలీస్, అటవీ అధికారులతో పోడు భూముల సర్వే ప్రక్రియ, అటవీ భూముల పరిరక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్ట ప్రకారం ఇదివరకే ఆక్రమణలో ఉన్న వారికి మాత్రమే సర్వే చేసి, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు జారిచేయుట జరుగుతుందని అన్నారు. కొన్ని గ్రామాల్లో క్రొత్తగా పోడు చేస్తే పట్టాలు ఇస్తారనే భావన ఉందని, ఇది పూర్తిగా తప్పని ఆయన తెలిపారు. కొత్తగా పోడు చేస్తే, వారికి మంజూరయిన పట్టాలు రద్దు చేస్తామని, రైతుబంధు పథకాన్ని ఆపేస్తామని కలెక్టర్ అన్నారు. ఇట్టివారిపై పోలీస్ కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారి భవిష్యత్తు పాడవుతుంది కలెక్టర్ హెచ్చరించారు. అడవులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని, అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని ఆయన తెలిపారు.
క్రొత్రగా పోడు చేస్తే వెంటనే సమాచారం అందించే బాధ్యత క్రొత్త పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ఆయా గ్రామాల సర్పంచ్ లపై ఉందని కలెక్టర్ అన్నారు. ఇదివరకే ఆక్రమణలో ఉండి, హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి భూముల సర్వే ప్రక్రియ జరుగుతుందని, ఈ నెలాఖరులోగా సర్వే, గ్రామ సభల నిర్వహణ పూర్తిచేసి ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీకి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలో 94 గ్రామ పంచాయతీల్లోని 132 ఆవాసాల్లో హక్కుల కోసం 18295 దరఖాస్తులు వచ్చినట్లు, శుక్రవారం నాటికి 14,430 దరఖాస్తులు పరిశీలన పూర్తయినట్లు, మిగులు దరఖాస్తుల పరిశీలన, గ్రామ సభల నిర్వహణ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, అదనపు డిసిపి డా. షబరీష్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ పాల్గొన్నారు.