సోదర సోదరీమణులారా
ఎర్రకోటపై నుంచి మాట్లాడుతున్నాను..
నేను “భారత రాజ్యాంగాన్ని”
నా మాట కాస్త వింటారా?
నా మనస్సాక్షి గాయపడింది,
ఆ గాయాలపొరలు మీతో పంచుకుంటున్నాను నేడు.
గాయంచేసిన వారి ఆచూకీ తీసి కాస్త అదిలిస్తారా?
లేదంటే – నా బాధలు మీకెందుకంటారా?
నేనొక శక్తిని, అజరామరమై లిఖిత ప్రతిని,
మీ అందరినీ “భారతీయులని” గుర్తింపునిచ్చే రాచముద్రను.
స్వాతంత్య్ర విజయోత్సవాన్ని,గణతంత్ర గేయగీతాన్ని,
రాజేంద్రప్రసాద్ గారి మానసపుత్రికని,
బాబా భీంరావ్ అంతరంగాన్ని,
నేను స్వాతంత్ర్యయోధుల వీరగంధాన్ని,
భారతీయులకు విధుల వేగుచుక్కని,
ప్రజాస్వామ్య ప్రసంగాన్ని, ప్రాధమికహక్కుల చిరునామాని,
ప్రవర్తనా నియమావళికి పద్దుని నేనే,
చట్టపు లక్ష్మణరేఖలని కూడా నేనే,
బైబిల్, ఖురాన్, రామాయణ, భగవద్గీతలు నేనే.
నాది “భరతజాతి”, నా మతం “సమానత్వం”,
ఆకలిచావులు- నా గుండెల్లో దింపే గునపాలు,
స్వేచ్ఛాస్వాతంత్ర్య దుర్వినియోగం – నాకు మానభంగం,
చట్టసభల్లో నిర్వేదం – నా గొంతుకు బిగిసిన ఉరి,
న్యాయవ్యవస్ధకు పడే తూట్లు – నాకు కత్తిగాట్లు,
క్షణక్షణం కుట్రలు,కుతంత్రాలు,మతకల్లోలాలు,
నా ఉనికినే మృగ్యంగావించే సాధనాలు…
నా మాట విన్నారా ??
ఇంకా – నా గోడుమీకెందుకంటారా??
విధులనెరిగి,హక్కులను సద్వినియోగించి
“భారత భాగ్యవిధాతలుగ”మారి,
నా మనుగడకి అసలగు అర్థాన్నిస్తారా….
శ్రీ సుధ కొలచన, హైదరాబాద్