క్షయ వ్యాధి(టిబి)పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్ నగర్ మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్ ఎస్ పి క్యాంప్ స్కూల్ ఆవరణలో సోమవారం ఏర్పాటయిన టిబి వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, బరువు తగ్గడం, కళ్లెలో రక్తం జీరలు, ఆకలి మందగించడం, రాత్రి వేళల్లో జ్వరం,చెమటలు పట్టడం వంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి టిబి పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. టిబి వ్యాధి నిర్ధారణ అయినటువంటి వారికి ఉచిత మందులు ఇవ్వడంతోపాటు చికిత్స కాలంలో వారికి పోషకాహారం నిమిత్తం నెలకు 500 రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.
సకాలంలో మందులు వాడనటువంటి టిబి వ్యాధిగ్రస్థుల వల్ల సంవత్సరములో 12 నుంచి 15 మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిబి నోడల్ పర్సన్ ఇందిరాల రామకృష్ణ, టిబి సూపర్వైజర్ మమత,ల్యాబ్ టెక్నీషియన్ రమేష్,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.