నవంబర్ 26 న, జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు తెలంగాణ శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం సమావేశం పట్టణ అధ్యక్షుడు షేక్ సైదా అధ్యక్షతన మంగళవారం జరిగింది.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ ఫెడరేషన్ల నాయకత్వంలో సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు.
కోట్లాది మంది భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డుని ఎత్తివేయాలని కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. దీనివలన కార్మికులకు ఆసరాగా ఉన్న కార్మికుల సభ్యత్వ రుసుము ద్వారా, భవన నిర్మాణ సెస్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని కార్మికుల కోసం కాకుండా ఇతర మార్గాల్లో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
దీనివలన ఇప్పటిదాకా భవన కార్మికులు పొందుతున్న అన్ని రకాల పథకాలు రద్దు అయ్యే ప్రమాదం ఉందని, కార్మికులకు గుండెకాయగా ఉన్నటువంటి కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్, సమ్మె హక్కు, పని గంటలు, పని భద్రత, సంక్షేమం, పెన్షన్ సౌకర్యం వంటి అనేక అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
ఒకపక్క కరోనా నేపథ్యంలో ఉపాధి అవకాశాలు తగ్గి పనిలేక కష్టంగా ఉన్న ఈ సమయంలో నిర్మాణాలు ఆగిపోయి, రోడ్డున పడుతున్న కార్మికులకు ప్రభుత్వం ఉన్న ఈ హక్కుల తొలగింపు వలన మరింత ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని అన్నారు.
మోడీ విధానాల వలన దేశంలో అన్ని రకాల కార్మికవర్గం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలన్నిటికీ పోరాటమే పరిష్కారమని దీనిలో భాగంగా ఈ నెల 26న జరిగే “దేశవ్యాప్త సమ్మె” లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ పట్టణ సిఐటియు కో- కన్వీనర్ యల్క సోమయ్య గౌడ్, షేక్ సైదా, బంక శ్రీనివాసరెడ్డి, కే. ఏలియా, పల్లపు రామకృష్ణ, పల్లపు వెంకటేశ్వర్లు, గోవిందు, వెంకన్న,వినాయకరావు, నరసింహారావు, రాజు, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.