కరోనా మహమ్మారి అంతానికి టీకా ఒకటే మార్గమని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చించ్ ఘాట్ గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిత స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఆమె పరిశీలించారు.
వ్యాక్సిన్ తీసుకుంటున్న వారు, వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ ను తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పటేల్లు తమ గ్రామస్తులతో మాట్లాడి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
మహిత జిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ చించఘాట్, చిన్న చించఘాట్, జెండాగుడా గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు . 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
పీహెచ్ సీ పరిధిలో వంద శాతం వ్యాక్సిన్ వేయించడానికి మహిత సంస్థ ద్వారా 30 మంది వాలెంటర్ల్ , ఆరుగురు నర్సులు, ముగ్గురు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ముగ్గురు పిహెచ్ సీ కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్ ఓ రాథోడ్ నరేందర్, మెడికల్ ఆఫీసర్ రోజారాణి, ప్రత్యేక అధికారి పద్మ భూషణ్ రావు, సర్పంచ్ కుంర శ్యామ్ రావు, ఎంపిటిసి జంగు బాపు, ఎంపీడీవో శివలాల్ ,ఎంపీవో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.