ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప వ్యక్తి అని ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ యల్.శర్మన్ అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ శర్మన్, అదనపు కలెక్టర్లు మను చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బందితో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం సాగిందని అన్నారు. ఆయన ఆశయాలకనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి కారకుడని అన్నారు. జయశంకర్ క్రమశిక్షణకు మారుపేరని, విద్యార్థి దశ నుండి యూనివర్సిటీ వీసీ వరకు ఎకనమిస్టు నుంచి తెలంగాణ సిద్ధాంతకర్త వరకు ఆయన జీవితంలోని సిద్ధాంతాలను నేటి యువత అనుకరించడంమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు అనిల్ ప్రకాష్, సీతారాం, నర్సింగరావు, రామ్ లాల్, రాజేశ్వరి, ఎర్రి సామి, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యం న్యూస్, కొల్లాపూర్