అప్ఘనిస్తాన్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులను వెంటనే వెనక్కి తీసుకువచ్చే చర్యలను కేంద్రం తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్రమోడీకి బహిరంగలేఖ రాశారు.
లేఖలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉపాధి లేక, సర్కార్ చేయూత లేకపోవడంతో తెలంగాణ నుంచి లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లి జీవిస్తున్నారని తెలిపారు. కాగా కొద్ది రోజుల నుంచి అప్ఘనిస్తాన్ దేశంలో శాంతి భద్రతలు చేజారిపోయాయని వివరించారు. అక్కడ తాలిబన్ తీవ్రవాదులు ఆ దేశ రాజధాని కాబూల్ను హస్తగతం చేసుకుని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.
అప్ఘనిస్తాన్లో ఉపాధి కోసం వెళ్లి అక్కడ చిక్కుకుని తెలంగాణ ప్రజలు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ సాయం చేస్తే వెంటనే తిరిగి వచ్చేందుకు వారు సిద్దంగా ఉన్నారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. ఇతర దేశాలు ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో వారి దేశ ప్రజలను సురక్షితంగా వెనక్కి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. అలాగే మన దేశ ప్రజలను తీసుకు వచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర విదేశాంగ శాఖ అప్ఘనిస్తాన్లో ఉన్న మన దేశ ప్రజల వివరాలు సేకరించి సురక్షితంగా వారిని ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అప్ఘన్లో ఉన్న మన ప్రజల సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.
పెద్ది నరేందర్, సత్యం న్యూస్, నకిరేకల్.