రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాఘటంగా కొనసాగిస్తూనే వస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఅర్ ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని, తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.’’ అని అన్నారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉందని, ఈకార్యక్రమాన్ని ఆగస్టు 3వ తేదీ నుంచి పున: ప్రారంభించాలని సిఎం ఇప్పటికే ఆదేశించారని వెల్లడించారు.
రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సిఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని రైతులకు సూచించారు.