అన్నదాత సుభిక్షంగా ఉండాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆకాంక్షించారు. రైతు లోగిళ్లలో ధాన్యపు రాశులు కురవాలని, తద్వారా సమాజం కూడా సుఖఃసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ ఏడాది అన్ని పంటలు బాగా పండాయని, చెరువులు, నదులు జలకళతో కళకళలాడుతున్నాయని అన్నారు. ప్రజలంతా రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని, ప్రతీ కుటుంబంలో ఆనందం వెళ్లివిరియాలని కలెక్టర్ కోరారు. విజయనగరం శిల్పారామం లో తెలుగువారి సంస్కృతి ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు కన్నుల పండువగా జరిగాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
క్రాంతి సంబరాల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉన్నతాధికారులు సైతం తమ హోదాను ప్రక్కనపెట్టి, ఈ సంబరాల్లో ఆడిపాడి అలరించారు. జిల్లా స్త్రీశిశు సంక్షేమ, సాధికారతాధికారి బి.శాంతకుమారి, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ పద్మలత, ఎపిఎం సులోచన, ఐసిడిఎస్ ఉద్యోగి సుభాషిణి పాటలు పాడి ఆకట్టుకున్నారు. మరో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సుదర్శన దొర కర్రసాము ప్రదర్శించారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు సంక్రాంతి నృత్యరూపకాలతో అలరించారు.
రంగవల్లుల పోటీల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన సులోచన, ప్రవీణ, జ్యోత్స్న, పాల్గొన్న ప్రతీఒక్కరికీ బహుమతులు అందజేశారు. వంటల పోటీల్లో రమణమ్మ, దుర్గ, నాగమణి వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు సుదర్శనదొర, సూర్యనారాయణ, పద్మలత, వెంకటేశ్వర్రావు, ఐసిడిఎస్ పిడి శాంతకుమారి, జిల్లా టూరిజం అధికారి పిఎన్వి లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్, మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ఆర్వి ప్రసన్నకుమారి విజేతలకు బహుమత్రి ప్రదానం చేశారు. రామవరం హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు తన వ్యాఖ్యానంతో అలరించారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్సి డాక్టర్ పి.సురేష్బాబు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఆర్డిఓ ఎంవి సూర్యకళ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.