మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు చేపట్టిన ఆందోళనలు 50వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెంలో కులవృత్తులతో వినూత్న నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు 50వ రోజుకు చేరడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రాయపూడిలో రైతుల దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని పోలేరమ్మ ఆలయంలో కొబ్బరికాయకొట్టి చంద్రబాబు పూజలు చేశారు. తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు రైతులను పరామర్శించిన వారిలో ఉన్నారు.