తనకు విశాఖలో మూడు బెడ్రూం ప్లాట్ తప్ప ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లేవని, కుటుంబ సభ్యుల పేరుతో కూడా లేవని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తరువాత చాలా మంది రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
మీ పేరు ఉపయోగించుకొని అధికారులకు చెప్పి ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయని, వాటిల్లో మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పి మీ పేరును దుర్వినియోగం చేస్తున్నారని కొందరు నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ, జీవీఎంసీ కమిషనర్, వీఎంఆర్డీఏ కమిషనర్ ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు వరకు ఏ ప్రాపర్టీ విషయంలో ఏ ఒక్క అధికారికి కూడా నేను ఫోన్ చేయలేదు.
ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను చెప్పను. ఇది నా ప్రిన్సిపుల్స్కు విరుద్ధం. చట్ట ప్రకారం అధికారులు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. న్యాయం వాళ్లే చేస్తారు. దీంట్లో రాజకీయం జోక్యం అవసరం ఉందని భావించడం లేదు. ఎవరైనా నా పేరు చెప్పి అధికారుల దగ్గరకు వస్తే వెంటనే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా అని విజయసాయి రెడ్డి అన్నారు.