అగ్ని ప్రమాదాలు సంభవించ కుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు.
ఈ నెల 14న నుండి ఈ నెల 20వ తేదీ వరకు జాతీయ అగ్ని మాపక దళ వారోత్సవాల గోడ పత్రిక, అవగాహన కరపత్రాలను బుధవారం క్యాంపు కార్యాలయంలో అగ్నిమాపక శాఖ, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అగ్ని ప్రమాదాల పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని దీని వల్లనే తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయనన్నారు.
జిల్లాలో ఎక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను వారోత్సవాల్లో విరివిగా చేపట్టాలని అగ్నిమాపక శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
అగ్ని ప్రమాద నివారణ చర్యలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ మాత్రం ప్రమాదాలు జరగవని ఆస్తి కూడా ఏ మాత్రం నష్టం జరగదనే వాస్తవాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించాలన్నారు.
అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 టోల్ ఫ్రీ నెంబర్ లేదా 08540 272389,8712699372, 8712699373 నెంబర్లకు ఫోన్ చేసి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అగ్నిప్రమాదాల నుంచి విముక్తి కలిగేందుకు ఆస్తులను రక్షించుకునేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
వేసవికాలంలో అధికంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి
అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో తీసుకో వాల్సిన జాగ్రత్తలను వారోత్సవాల్లో ప్రజలకు వివరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి ఐ. కృష్ణమూర్తి, సిపిఓ భూపాల్ రెడ్డి డిఆర్డిఓ నర్సింగరావు డిపిఆర్ఓ సీతారాం, అగ్నిమాపక శాఖ సిబ్బంది కురుమూర్తి, జగన్మోహన్, మీనారెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, నాగర్ కర్నూలు