విశాఖలోని ఫిషింగ్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళన చేశారు. దాంతో వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. 20 ఏళ్ల క్రితం విశాఖ కంటైనర్ టెర్మినల్కు భూములిచ్చిన సమయంలో 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం,ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు పరచలేదని వారు ఆందోళన చేశారు. కంటైనర్ టెర్మినల్కు వెళ్లే మార్గంలో మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు.
దీనివల్ల ఇవాళ ఉదయం నుంచి కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. వేల కోట్ల లావాదేవీల ఎగుమతులు,దిగుమతులు ఆగిపోయాయని అక్కడి అధికారులు వెల్లడించారు. మర పడవలను అడ్డుపెట్టి టెర్మినల్ వైపు వాణిజ్య ఓడలు రాకుండా మత్స్యకారులు అడ్డుకున్నారు. కంటైనర్ టెర్మినల్ నిర్మాణ సమయంలో భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఇచ్చినా అధికారులు పట్టించుకోక పోవడంతో నిరసనకు దిగినట్లు మత్స్యకార సంఘం నాయకులు వెల్లడించారు. పరిహారం విషయం తేల్చే వరకూ టెర్మినల్ ప్రధాన గేట్లు తెరిచేది లేదని,ఒక్క కంటైనర్ కూడా లోపలకి వెళ్లేందుకు వీల్లేదని మత్స్యకారులు అంటున్నారు.