కామారెడ్డిలో భారతీయ జనతాపార్టీ మరో పోరుకు సిద్ధమైంది. డ్వాక్రా సంఘాల మహిళలకు రావాల్సిన పావలా వడ్డీ, అభయహస్తం డబ్బులపై ఈ నెల 30 నుంచి 10 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే గ్రామాల వారిగా మహిళా సంఘాలతో సమావేశమై రుణాలపై మాట్లాడుతున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆయా గ్రామాల్లో మరోమారు మహిళా పోరు పేరుతో కార్యక్రమాల వివరాలను ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేశారు.
అయితే కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీని అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత కర్రోళ్ల లింగం చించేశారు. దాంతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో సదరు నేతపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. చిన్నమల్లారెడ్డి గ్రామంలో మహిళలకు రావలసిన వడ్డీ లేని రుణాలు, అభయ హస్తం డబ్బులు, శ్రీనిధి వడ్డీ బకాయిల విడుదల కోసం ఈ నెల 30 వ తేదీ నుండి బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో చేసే ఉద్యమానికి సంబంధించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశామన్నారు.
ఈ ఉద్యమానికి మహిళల నుండి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక మరో మారు – మహిళా పోరు ఫ్లెక్సీని అధికార పార్టీ నేత చింపివేశాడని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఉరుకునే ప్రసక్తే లేదనీ, అధికార పార్టీ నాయకులు ఉద్యమాన్ని ఎంత అనిచివేయాలని చూసినా వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు చెల్లించే వరకు పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.