ఎగువన ఉన్న క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు, నల్లమల అడవుల్లో కురుస్తున్న నీరు వచ్చి చేరుతుండటంతో ఈ సీజన్ లో తొలిసారిగా శ్రీశైలానికి వస్తున్న వరద తొలిసారిగా సుమారు లక్ష క్యూసెక్కులకు చేరింది.
ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ కు 95,279 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 853 అడుగులకు పైగా నీటిమట్టం నమోదైంది.
87 టీఎంసీలకు పైగా నీరు చేరుకుందని అధికారులు వెల్లడించారు. వరద నీరు మరింత కాలం పాటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.