తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి కైంకర్యాలకు అవసరమైన పుష్పాలను తిరుమల బాట గంగమ్మ ఆలయం సమీపంలో శ్రీవారి పుష్ప ఉద్యానవనాన్ని టిటిడి ఏర్పాటు చేసింది.
ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది.
ఇందులో సంప్రదాయ పుష్పాలైన చామంతి, వృక్షి, రోజ, మధురై మల్లెలు, కనకాంబరం, మాను సంపంగి, లిల్లీలు, తులసీ, పన్నీరు ఆకు, తదితర మొక్కలను ఏర్పాటు చేశారు.
ఈ పుష్పాలను ఏప్రిల్, మే నెలల నుండి శ్రీవారి కైంకర్యాలకు వినియోగించనున్నారు.
రూ.1.5 కోట్లతో తిరుమల క్షేత్ర పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి శిలా తోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేశారు.
ఇందులో ఏడు ఆకులు కలిగిన అరటితోపాటు, తులసి, ఉసిరి, మోదుగ, జువ్వి, జమ్మి, దర్భ, సంపంగి, మామిడి,
పారిజాతం, కదంబం, రావి, శ్రీగంధం, అడవి మల్లి, మొగలి, పున్నాగ, అశోక, పొగడ, గన్నేరు, నాబి, మాదిఫల, బొట్టుగు, భాందిరా వంటి 25 రకా లు ఉన్నాయి.
గోగర్భం డ్యాం వద్ద శ్రీ వేంకటేశ్వర శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనంలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కల్పించేందుకు దాతల సహకారంతో తిరుమలలోని ఉద్యాన వనాలను టిటిడి అభివృద్ధి చేస్తోంది. టిటిడి గార్డెన్, అటవీ విభాగం ఆధ్వర్యంలో రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలోను విరివిగా మొక్కలను పెంచుతున్నారు.