గత పాలకులు దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల నుంచి తెలంగాణ రైతును దేశానికే ఆదర్శంగా నిలపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించిన రోజు చూస్తున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడు లేని విధంగా పూర్తి స్థాయిలో ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి అన్నారు.
ఆర్టీసీ కార్గో ద్వారా ఆహార ధాన్యాల సరఫరా
అందుకు అనుసంధానంగా వివిధ ప్రాంతాల నుండి లారీల ద్వారా ధాన్యం తరలిస్తుండటంతో పాటు, ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా సరుకు రవాణాను చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కేంద్రం అల్లిపురం నుండి ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా సరుకు రవాణా కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఇప్పటికే జిల్లాలో దాదాపు సేకరణ పూర్తి అయిందని, మరి కొన్ని చోట్ల కొనుగోలు కొనసాగుతుందన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం ఏ రాష్ట్రంలోనూ లేదని, ప్రభుత్వ సూచనల ప్రకారం రైతుల నుండి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు.
అన్ని రకాల పంటలు పండించే ఏర్పాట్లు
తెలంగాణలో ప్రజల ఆహార వినియోగంపై ప్రభుత్వం సంపూర్ణ సర్వే నిర్వహించిందని, దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా ఎదిగిన విషయం గుర్తు చేశారు. తెలంగాణలో వినియోగంతో పాటు దేశంలో, ప్రపంచంలో డిమాండ్ ఉన్న పంటల సాగుకు చేసేందుకు రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు పంటను అమ్ముకునేందుకు కష్టపడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని, తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించే స్థితికి తేవలన్నదే ప్రభుత్వం అభిమాతమన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు, మార్కుఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాస్ నాయక్ తదితరులు ఉన్నారు.