ఎంతో రద్దీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండో పెన్నా బ్రిడ్జి మంచి కార్యక్రమం అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించ తలపెట్టిన రెండో బ్రిడ్జి కార్యక్రమానికి ఎంపీ ఆదాల, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగరంలో దాదాపు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
వంద కోట్లతో పెన్నా బ్రిడ్జి, మరో 100 కోట్లతో కరకట్ట పనులు, 200 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ కాలువల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇరిగేషన్ పనులకు అనిల్ కుమార్ యాదవ్ జిల్లా కు 2000 కోట్ల రూపాయలను మంజూరు చేయించారని, అందుకు ఆయనను అభినందిస్తున్నానని తెలిపారు. ఇంత జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఏమి జరగలేదని విమర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు హైవే మీద 3 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రాజెక్టుల సాధనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రైల్వే, టూరిజం, హైవే పనులను శ్రద్ధతో చేస్తున్నామని చెప్పారు. గతంలో వైయస్ హయాంలో, ప్రస్తుతం జగన్ హయంలో ఇరిగేషన్ పనులు త్వరగా జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా వాసులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ హరిత, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఖలీల్, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరిప్రసాద్, నరసింహారావు, మైపాడు అల్లా బక్షు, మధు తదితరులు హాజరయ్యారు.