సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనున్నది. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన అనుకూల తీర్పు పై స్టే ఇవ్వకుండా విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును బదలాయించినందున ఆలయంలో మహిళల ప్రవేశానికి ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది. అయ్యప్ప ఆలయంతో బాటు ఇతర మతాలకు సంబంధించిన మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసులన్నింటిపైనా మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావించిన సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ చేసిన నేపథ్యంలో కొందరు మహిళా సంఘాల నాయకులు, మానవహక్కుల సంఘాల వారూ ఇప్పటికే శబరిమల వెళుతున్నట్లు ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లో తాము శబరిమల ఆలయంలోకి ప్రవేశించి తీరుతామని మహిళలు చెబుతున్నారు. దీన్ని ఎదుర్కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 27 వరకు అంటే ఈ నెలన్నరపాటు స్వామివారి ఆలయంలో నిత్యపూజలు జరుగుతాయి. ఆలయ ప్రవేశం కోరే మహిళలు కోర్టు అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.
previous post