ఒక జిల్లా కు బాధ్యతాయుతమైన అధికారి ఉంటే.. పథకాలతో పాటు సంబంధిత లబ్ధిదారులకూ ఎంతో ఉపయోగపడుతుంది. సరిగ్గా ఆ కోవలోకి వస్తారు…విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు.మరికొద్ది నెలలో పదవీవిరమణ పొందనున్న నేపథ్యంలో… ముఖ్యంగా ఆర్మీ కి సంబంధించిన రిక్రూట్ మెంట్ గురించి.. యువకులకు ఎంతో ఉపయోగపడుతుందని…కలెక్టరేట్ కార్యాలయంలో… ఆర్మీ కల్నల్ చే..సమావేశం పెట్టించారు…డీఆర్ఓ గణపతిరావు. వివరాల్లోకి వెళితే భారత సైనిక దళాల్లో అగ్నివీర్ నియామక ప్రక్రియ ప్రారంభమయ్యిందని, విశాఖపట్నం రిక్రూట్మెంట్ సెంటర్ డైరెక్టర్ కల్నల్ వినయ్కుమార్ చెప్పారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో కల్నల్ మాట్లాడుతూ, అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియను వివరించారు. అగ్నివీర్ నియామకాల కోసం ఫిబ్రవరి 16 నుంచి ఆన్లైన్ రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యిందని,ఈ నెల 15వరకు రిజిష్ట్రేషన్లు చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. గత రిక్రూట్మెంట్లకు భిన్నంగా, అగ్నివీర్ ఎంపిక కోసం ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, నిర్ణీత తేదీల్లో నిర్వహించిన ఆన్లైన్ టెస్టు తరువాత, దానిలో ఉత్తీర్ణులైన వారికి శారీరక ధారుడ్య పరీక్ష, వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడతో సహా దేశంలో మొత్తం 76 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్ష జరుగుతుందని, ఈ మార్పులను అభ్యర్ధులు గమనించాలని సూచించారు.
అభ్యర్థుల వయసు 17 సంవత్సరాల 6 నెలలు నిండి, 21 ఏళ్ల లోపు ఉండాలని, ఆయా పోస్టులను బట్టి పదో తరగతి నుంచి ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణత, ఇతర సాంకేతిక అర్హతలు ఉండాలని చెప్పారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ జనరల్ డ్యుటీ (ఉమెన్ మిలటరీ పోలీస్), అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8వ తరగతి పాస్, మొదలగు ఆరు రకాల విభాగాల్లో రిక్రూట్మెంట్ జరుగుతోందని చెప్పారు. తొలిసారిగా మహిళలకు కూడా ఎంపిక నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.
పూర్తిగా ప్రతిభ ఆధారంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతుందని, మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని కల్నల్ వినయ్ కుమార్ యువతను కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు మాట్లాడుతూ, భారత సైన్యంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. సైనిక దళాల్లో సేవలందించేందుకు అగ్నివీర్ నియామక ప్రక్రియ యువతకు ఒక సువర్ణావకాశమని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మేజర్ డాక్టర్ జిఎస్ రంథావా తదితరులు పాల్గొన్నారు. నియామక ప్రక్రియకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.