హైదరాబాద్ నగరానికి భాగ్యనగరంగా పేరు మారుస్తామని, ముస్లీం సమాజానికి నిజంగా మేలు చేసింది ఏవరైనా ఉంటే అదీ బీజేపీ పార్టీయేనని, ట్రిపుల్ తలాక్ బిల్లుతో ఎంతోమంది మహిళలకు మేలు చేశారని, మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలు, వారి కుటుంబాల అభివృద్ధికే తప్ప ప్రజలకు చేసిన మేలేం లేదని, అన్ని వర్గాలకు మేలు చేయడమే బీజేపీ లక్ష్యమని హైదరాబాద్లోని నిజాం నిరంకుశ పాలనకు సర్ధార్ వల్లభ్భాయ్ పటేల్ చరమగీతం పాడారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి శనివారం నగరంలోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చార్మినార్ పలు ప్రాంతాల్లో రోడ్షోలు, బహిరంగ సభల్లో మాట్లాడారు.
వరద సహాయం బ్యాంకుల్లో ఎందుకు వేయలేదు?
ఈ సందర్భంగా ఆదిత్యనాత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీకి చురకలంటించారు. వరదసహాయం బ్యాంకుల్లో కాకుండా నగదు రూపేణా ఎందుకిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్, మజ్లిస్ కుటుంబాలే బాగుపడ్డాయన్నాయన్నారు. బీజేపీ పగ్గాలు చేపడితే అవినీతి లేని పాలన అందిస్తామని స్పష్టం చేశారు.
10 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్
నరేంద్రమోదీని పాలనను చూసే ప్రజలు తిరిగి బీజేపీకి పట్టం కట్టారన్నారు. కరోనాపై మోదీ తీసుకున్నచర్యలు ప్రపంచదేశాలు మెచ్చుకోవడాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు. యూపీలో 10 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అందిస్తున్నామన్నారు. ఇక్కడ అలాంటి పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
మైనార్టీల్లో లేని పోని వ్యతిరేకత రేకెత్తిస్తోంది ఆ పార్టీలే
నాలుగువందల ఏళ్లుగా పరిష్కారానికి నోచని అయోధ్య వివాదానికి ప్రధాని మోదీ నేతృత్వంలో అద్భుతమైన పరిష్కారం లభించిందని, రామమందిర నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందన్నారు. మైనార్టీల మనసుల్లో బీజేపీ పట్ల లేనిపోని వ్యతిరేకతను పొగుచేస్తున్నది ఆ పార్టీలేనని ఎద్దేవా చేశారు. దేశం పట్ల నిజమైన భక్తి ఉన్న వారికి బీజేపీ వ్యతిరేకం కాదని, దేశ వ్యతిరేకులకు మాత్రమే వ్యతిరేకమని తేల్చి చెప్పారు.
కాగా ఆయన పాల్గొని ప్రసంగించిన ఆయా కార్యక్రమాల్లో ప్రజలు,కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలు మారుమోగించారు. పెద్ద ఎత్తున ఆయా కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని యోగికి స్వాగతం పలుకుతూ, పూలు జల్లుతూ అభిమానాన్ని బహిర్గతం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రసింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.