ఒప్పంద, పొరుగు సేవలలో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్ ,వ్యాయామ బోధకులను, కే.జీ.బీ.వీ ఇంటర్మీడిట్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలని శ్రీకాకుళం జిల్లా ఒప్పంద పొరుగు సేవల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుండబాల మోహన్ కోరారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగాలను శాశ్వత ఉద్యోగస్థులుగా మారుస్తామని వై.ఎస్.ఆర్.సి.పి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ హామీలను నిలబెట్టుకోని వలసిందిగా సమగ్ర శిక్ష ఒప్పంద ,పొరుగు సేవల ఉద్యోగస్తులు కోరుతున్నారు.
గత పది సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నా నేటికీ కనీసం పనికి తగ్గ వేతనం కూడా ఇవ్వటం లేదని ఆయన అన్నారు. సమగ్ర శిక్ష లో ఒప్పంద పొరుగు సేవల లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు శాశ్వత ఉద్యోగస్తులకు ఉండవలసిన అర్హతలు అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు.
పేరుకు తాత్కాలిక ఉద్యోగస్తులని చెప్పి పగలు రాత్రులు కూడా వీరి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చిరు ఉద్యోగస్తులను ఆదుకోవాలని ఆయన కోరారు.