రాజకీయాల కోసం తమపై విమర్శలు చేస్తున్నారని మిల్లర్లు ఖండించిన కొద్ది సేపటికే కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా పౌర సరఫరాల అధికారిని సస్పెండ్ చేశారు. ఆసిఫాబాద్ MLS పాయింట్ లో ఇటీవల వెలుగు చూసిన భారీ (8400 క్వింటాళ్ల) బియ్యం కుంభకోణం పై పలు అనుమానాలు ఉన్నాయని భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే.
అసలు MLS పాయింట్ కు బియ్యం రాకపోయినా వచ్చినట్లు చూపెట్టి రూ.3 కోట్ల బిల్లులు చెల్లించారని ఆయన ఆరోపించారు. పెద్ద తలకాయలను వదిలేసి చిన్నపాటి అధికారులను సస్పెండ్ చేయడంతో అసలు విషయం తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. పథకం ప్రకారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ 8400 క్వింటాళ్ల బియ్యాన్ని తన అన్నదాన సత్రం కోసం మళ్ళించారని ఆరోపించారు.
ఇది ఇలా ఉండగా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఎం.ఎల్.ఎస్. పాయింట్ లో జరిగిన అవకతవకలపై విచారణ కమిటీ నివేదిక మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆ ప్రకటనలో తెలిపారు. ఎం.ఎల్.ఎస్. పాయింట్ లో జరిగిన అవకతవకలపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించడం జరిగిందని, కమిటీ నివేదిక మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారిని సస్పెండ్ చేయడం జరిగిందని, విచారణ కమిటీ 15 రోజులలోగా పూర్తి నివేదిక అందించాలని ఆదేశించారు.