సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రతియేటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవాల్లో గిరిప్రదక్షిణ ఉత్సవం విశేష ప్రాచుర్యం పొందిందని అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీను బాబు తెలిపారు.
బుధవారం సింహాద్రి నాధుడుని దర్శించుకొని, నిత్య కళ్యాణం సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భముగా శ్రీనుబాబు ఉత్సవాల వివరాలు వెల్లడించారు. కరోనా కారణంగా గిరి ప్రదక్షిణ ఉత్సవం గడచిన రెండేళ్లుగా నిర్వహించలేదు. ఐతే ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో గిరిప్రదక్షిణ ఉత్సవం జూలై 12 న నిర్వహించడానికి అవకాశం వుంది.
కొండ దిగువన తొలి పావంచా నుంచి ప్రారంభమయ్యే ఈ గిరిప్రదక్షిణ మహోత్సవం సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల పొడవున కాలి నడకన సాగనుంది. జూలై 13 మరుసటి రోజు ఆషాఢ పౌర్ణమి నేపథ్యంలో సిరులొలికించే సింహాద్రి నాధుడుకి మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.
అదే ఆఖరి విడత చందన సమర్పణ కాగా ఆ తరువాత వచ్చే శ్రావణ పౌర్ణమికి కరాళ చందన సమర్పణ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీనితో స్వామి పూర్తి నిత్య రూపంలో కి వస్తారు. ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం, చందనోత్సవం, ధ్వజ స్తంభాలు ప్రతిష్ట లు, నృసింహ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆలయ వర్గాలు నిర్వహించాయి. ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విశేష ఏర్పాట్లు చేసింది.