సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అతి ప్రాచీనమైన,ప్రశస్తమైన శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో శనివారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కళ్యాణం భక్తుల నడుమ అత్యంత నేత్రపర్వంగా జరిగింది.
అర్చక స్వాములు ప్రాతః కాలంలో స్వామివారిని,అమ్మవారిని అత్యంత మనోహరంగా అలంకరించారు.అర్చన సేవానంతరం శ్రీ విష్ణు సహస్రం,గోదాదేవి, రామానుజ అష్టోత్తర శతనామావళితో షోడశోపచార సహిత పూజలు నిర్వహించారు.తిరుప్పావై సేవా కాలాన్ని మహిళలు శ్రావ్యంగా పఠించారు.
ఉదయం 10 గంటలకు అమ్మవారిని తులసి మాలలతో,వివిధ రకాల పుష్ప మాలికలతో,నూతన పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి భద్ర పీఠంపై మండపంలో అధిష్టింపజేశారు. విశ్వక్సేన ఆరాధన,వాసుదేవ పుణ్యాహవాచనం, కంకణ ధారణ,పాద ప్రక్షాళన,మధుపర్కం, మహాసంకల్పం,చూర్ణిక,మంగళాష్టకాల నడుమ వేద పండితులు శాస్త్రోక్తంగా, శ్రావ్యంగా, వేదమంత్రాలు నటిస్తుండగా వధువు తరఫు బంధువులుగా స్థానా చార్యులు,స్వామివారికి పాదప్రక్షాళన గావించి,సుముహూర్తానికి కన్యాదానం జరిపి,జీలకర్ర బెల్లం అమ్మవారికి, స్వామివారికి శిరస్సున అర్చక స్వాములు అలంకరింపజేశారు. మాంగల్య సూత్రధారణ,తలంబ్రాలు మేళతాళాల మధ్య అర్చకులు గోదాదేవి కళ్యాణం జరిపించారు.
ఈ కళ్యాణ క్రతువు కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి పర్యవేక్షించి కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు గావించారు. ఈ కార్యక్రమంలో స్థానా చార్యులు, అర్చకులు,దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు,పుర ప్రముఖులు,మహిళా భక్తులు,భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నేత్రపర్వంగా సాగిన కళ్యాణం తిలకించి తరించారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్