కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా ఆదివారం తిరుమల వసంత మండపంలో గోపాష్టమి(గోపూజ) శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గోపూజ ముక్కోటి దేవతల పూజాఫలంతో సమానమని అన్నారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు తిరువారాధన చేశారు. అనంతరం ఆవు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. గోప్రదక్షిణ చేశారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్ఎకె.సుందరవదనాచార్యులు, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.