కరోనా భయంలో పాఠశాలలు మళ్లీ మూతపడటంతో ప్రయివేటు టీచర్లు ఉపాధికి దూరం అయ్యారని సామాజిక ప్రజాస్వామిక వేదిక ఆవేదన వ్యక్తం చేసింది.
ములుగు జిల్లా కేంద్రంలో నేడు సామాజిక ప్రజాస్వామిక వేదిక జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ములుగు నియోజక వర్గ అధ్యక్షులు పోరిక సామేల్ నాయక్ అధ్యక్షత వహించారు.
జిల్లా అధ్యక్షులు చల్లా లింగయ్య ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ గత లాక్ డౌన్ కాలంలో విద్యా సంస్థలు మూసి వేయడం వలన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న విద్యావంతులైన ఎందరో నిరుద్యోగులు జీవనోపాధికి దూరమయ్యారని అన్నారు.
ఆ సమయంలో జీతాలు లేక అనేక సమస్యలను ఎదుర్కొంటూ భార్య పిల్లలను పోషించలేక దరిద్ర జీవనం అనుభవించారని ఆయన అన్నారు. పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడంతో సంతోషం చిగురించిన వారి ఆశలు అనతి కాలంలోనే మళ్లీ మొదటికి వచ్చాయని ఆయన అన్నారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలను మూసి వేయించిందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే వారికి కనీస జీవన భృతి క్రింద నెలకు రూ. 15 వేల రూపాయలను అందించి వారిని ఆదుకోవాలని లింగయ్య డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోరె రవి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల సంజీవ రావు, జి ఓదెలు, బానోతు సుభాష్, సుమన్, యాకన్న, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
కె. మహేందర్ గౌడ్, సత్యం న్యూస్