కరోనా కాలంలో మానవతా దృక్పథంతో సిమెంటు పరిశ్రమ యాజమాన్యం, కాంట్రాక్టర్ స్పందించి వేతనంతో కూడిన సెలవులు 14 రోజులు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి 50 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల పరిధిలోని రామాపురం ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో కృష్ణ పట్టే ఏరియా సిమెంట్ కస్టమర్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా రోషపతి మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 7500 రూపాయలతో పాటు నిత్యావసర సరుకులు, సన్న బియ్యం, ఆరు నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిమెంట్ పరిశ్రమలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం 24000 ఇవ్వాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సిమెంట్ ధరలు పెంచినా కార్మికుల వేతనాలను పెంచటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు తీగల శ్రీను, ఎస్ కె అజరుద్దీన్, సోమగాని ప్రకాష్ రావు, పసుపులేటి లక్ష్మయ్య, లింగారెడ్డి, పలిశెట్టి సైదారావు,అంకారావు, వై శ్రీను, తదితరులు పాల్గొన్నారు.