ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలోనే ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తున్నది. తెలంగాణ లో ఏదైనా పెద్ద సమస్య వచ్చినపుడు కేసీఆర్ అన్నీ చూస్తూనే ఉంటారు కానీ పట్టించుకున్నట్లు ఎక్కడా బయటపడరు.
ఇంటర్ విద్యార్ధులు 27 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆయన ఇలానే చేశారు. ఆ తర్వాత ఆర్టీసీ సమ్మె కాలంలో కూడా అలానే చేశారు. దాదాపు 25 మంది ఆర్టీసీ కార్మికులు మరణించినా ఆయన ఆర్టీసీ సమ్మెను పట్టించుకోలేదు. పట్టించుకున్నట్లు కనిపించలేదు.
ఎప్పుడైతే ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు రావడం, ఆ తర్వాత సమ్మె నిర్వీర్యం కావడం జరిగిందో వెంటనే జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికులకు వరాలు ప్రకటించేశారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం జరిగింది.
అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో ఇలానే చేయాలని సిఎం జగన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నది. రాజధాని తరలింపు విషయంలో మంకుపట్టు పట్టి ఉన్న ఆయన అమరావతి రైతులు చచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు. అమరావతి రైతుల మరణాలు సహజ మరణాలుగా కొట్టిపారేస్తున్నారు. సాధారణంగా ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి వాటిని సహజ మరణంగానే నమోదు చేసుకుంటారు.
జగన్ ప్రభుత్వం కూడా అలానే చేసుకుంటూ పోతున్నది. మరో వైపు విశాఖ పట్నంలోకి ఆఫీసుల తరలింపు ప్రారంభం అయింది. అమరావతిలో సొంత భవనాలు వదిలేసి విశాఖలో అద్దె భవనాలు కూడా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. విశాఖపట్నంలో కూడా చంద్రబాబు హయంలో నిర్మాణం జరిగిన భవనాల్లోకే రాజధాని కార్యాలయాలు పెట్టబోతున్నారు.
అమరావతిలో కొన్ని కార్యాలయాలు అలాగే ఉంచడం అధికారిక రాజధాని అమరావతిగానే కొనసాగిస్తూ వర్కింగ్ క్యాపిటల్ గా విశాఖను చేయడం ద్వారా కోర్టు కేసుల్లో ఇరుక్కోకుండా సిఎం జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేని విధంగా పకడ్బందీగా ప్లాన్ అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తి అయ్యేవరకూ అమరావతి రైతుల ఆందోళన గురించి పోలీసులు తప్ప మరెవరూ పట్టించుకోరు. ఆ తర్వాత పెద్ద ప్యాకేజీ ఇచ్చేస్తే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేసినట్లే అమరావతి రైతులు కూడా చేస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.