తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా కార్యదర్శి సుంకర క్రాంతి కుమార్
ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని,విద్యాభివృద్ధి కొరకు మెరుగైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర స్పందన వేదిక సూర్యాపేట జిల్లా కార్యదర్శి సుంకర క్రాంతి కుమార్,హుజూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు పిన్నపరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల ద్వారా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నప్పటికీ ఇంకా వేలాదిగా గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న జిల్లా పరిషత్,మండల పరిషత్ పాఠశాలలలో మౌలిక వసతులతో పాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేక, పాఠ్య పుస్తకాలు అందక,పారిశుద్ధ్య సిబ్బంది లేక,మరుగుదొడ్ల సౌకర్యము లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.
ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా అవసరంలేని పాఠశాలలలో ఉన్న ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలలకు డిప్యూటేషన్ ద్వారా అవకాశం ఇచ్చినా,లిఖితపూర్వక ఉత్తర్వులు రాకపోవటంతో ఎక్కడ స్వచ్ఛందంగా పనిచేస్తున్న పరిస్థితులు లేవని అన్నారు.ఐదు తరగతులకు నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటున్న పరిస్థితులు నెలకొన్నాయని, విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం,ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్