గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, ఎంపీఓ లు, ఇంజనీరింగ్ అధికారులతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల పురోగతి, బిసి సంక్షేమ రుణాలు, గ్రామీణ నీటి సరఫరా, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, తెలంగాణ కు హరితహారం కార్యక్రమ అమలుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 150 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు కాగా, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖచే 84, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖచే 66 భవన నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఇందులో 106 నిర్మాణాలు ప్రగతిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రగతిలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని, ఇంకనూ ప్రారంభం కాని వాటిని వెంటనే ప్రారంభించాలని ఆయన అన్నారు.
స్థల సమస్య ఉన్నచో, వెంటనే పరిష్కరించాలని, లేనిచో అట్టి గ్రామ పంచాయతీ భవనాన్ని అవసరమున్న వేరే గ్రామ పంచాయితీకి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో బిసి సంక్షేమ రుణాల క్రింద 26451 దరఖాస్తులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేశారని, ఇందులో 13820 దరఖాస్తులు అర్హులుగా, 2663 దరఖాస్తులు అనర్హులుగా గుర్తించినట్లు, 9968 దరఖాస్తులు విచారణలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
అర్హులైన దరఖాస్తుల డాటా ను ఆన్లైన్ నమోదులు పూర్తి చేయాలన్నారు. కేటగిరీల ప్రాధాన్యత క్రమాన్ని సూచించాలని, అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ లబ్దికి దూరం కావద్దని అన్నారు. జిల్లాలో 969 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతున్నదని ఆయన తెలిపారు. పాలేరు రిజర్వాయర్ పాత ఇంటెక్ వెల్ సమస్యతో కూసుమంచి లోని 74 ఆవాసాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని ఆయన అన్నారు.
రెండు రోజుల్లో సమస్య పరిష్కారమై నీటి సరఫరా జరగనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 864 పాత నీటి వనరులు, 10424 హ్యాండ్ పంప్స్ ఉన్నట్లు, రెగ్యులర్ బోర్, పంప్ సెట్లలో ఏవైనా మరమ్మత్తులు ఉంటే వెంటనే చేపట్టి, అవసరమైతే ఉపయోగానికి సిద్ధంగా ఉంచాలన్నారు. స్థానిక నీటి వనరులను క్రియాశీలం చేసి, త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జిల్లాలో తెలంగాణ కు హరితహారం క్రింద 2023-24 లో మండలాలకు 10 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ అన్నారు.
ఇప్పటివరకు 240424 మొక్కలకు గుంతలు త్రవ్వి, 178585 మొక్కలు నాటినట్లు నాటినట్లు ఆయన తెలిపారు. దశాబ్ది సంపద వనాల క్రింద 12 గ్రామ పంచాయతీల్లో ఇర్రిగేషన్ భూముల్లో 12 బ్లాకులు లక్ష్యంగా పెట్టుకోగా, 9 చోట్ల స్థల సేకరణ చేసి, 4200 మొక్కలు నాటినట్లు, మిగితా చోట్ల, స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి, మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు.
జిల్లాలో 589 తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 480 గ్రౌండింగ్ కాగా, 474 పూర్తి అయినట్లు కలెక్టర్ అన్నారు. 6 చోట్ల పనులు ప్రగతిలో ఉన్నట్లు, మిగిలిన చోట్ల త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.