ఏపీలో సెల్ఫోన్ లు చోరీ చేసి తెలంగాణలో విక్రయించే ముఠా గుట్టు రట్టు అయింది. వీరు చోరీ చేసిన సెల్ఫోన్ లను పాతబస్తీ సుల్తాన్ షాహికి చెందిన కైసర్కు విక్రయించినట్లు విచారణలో తేలింది. దీంతో ఏపీ పోలీసులు పాతబస్తీ సుల్తాన్షాహికి చెందిన కైసర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన నివాస గృహానికి చేరుకొని పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులకు కైసర్ దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులను విచారించి వెళ్లిపోయినట్లు సమాచారం.
వివరాలలోకి వెళితే .. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలలో పెద్ద మొత్తంలో సెల్ఫోన్ లు చోరీకి గురవుతున్నాయి. దీంతో కర్నూల్ పోలీసులు వలపన్ని ఓ ముఠాను పట్టుకుని విచారించగా హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహికి చెందిన కైసర్ (55)కు ఒక్కొక్క ఫోన్ను 2వేల నుంచి 3వేలకు వెయ్యిఫోన్లకు పైగానే విక్రయించినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.
దీంతో కర్నూల్ పోలీసులు విచారణలో భాగంగా మొఘల్పురా పోలీసులతో కలిసి హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహి ప్రాంతంలోని కైసర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ కైసర్ లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులను విచారించి వెళ్లిపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.