కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవ జరుగనుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.