కొడుకు పుట్టిన రోజున తండ్రి ఏం చేస్తాడు? కొత్త బట్టలు కొనిపెట్టి వీలైతే క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేయిస్తాడు. అంతే కదా? చుట్టుపక్కల వాళ్లను పిలిచి అందరికి టిఫిన్లో భోజనాలో పెడతాడు. అంతే కదా? కాదు. ఇవేవీ కాదని హుజూర్నగర్ లోని ఒక తండ్రి ఈ లోకానికి చాటి చెప్పాడు.
తన కుమారుడు ఒక్కడే సంతోషంగా ఉండటం కాదని తన చుట్టూ ఉన్న నిరాధారమైన వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలని ఆ తండ్రి భావించాడు. హుజూర్ నగర్ లోని 20 వ వార్డు కు చెందిన కొల్లూరి రాము తన కుమారుడు భరత్ జన్మదిన సందర్భంగా లాక్ డౌన్ బాధితులకు నిత్యావసరాలు పంచిపెట్టాడు. ఆ వార్డులోని సుమారు 50 మంది పేదలకు తన కుమారుడి జన్మదినోత్సవం సందర్భంగా నిత్యావసరాలు పంచి పెట్టి వారిని సంతోష పరిచాడు. సుతారి జానకి వేణుగోపాల్, మేళ్ళచెర్వు ముక్కంటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పేద ప్రజలు బయటికెళ్లి పని చేసుకోగలిగే పరిస్థితులు లేవు కనుక ప్రతి ఒక్కరూ పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అని వృధా ఖర్చులు చేయకుండా ఇలా పేద ప్రజలకు ఏదో ఒక విధంగా సహాయపడి ఒక్క పూట భోజనం పెట్టగలిగితే అది మన పూర్వజన్మ సుకృతమని పేద ప్రజలను ఒక విధంగా ఆదుకున్న వాళ్ళము అవుతామని సుతారి జానకి వేణుగోపాల్, మేళ్ళచెర్వు ముక్కంటి అన్నారు.