సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారాన్ని నిజమని నమ్మిన ప్రధాన స్రవంతి మీడియా వార్తలుగా ప్రచురించగా వాటి ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి తప్పులో కాలేశారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్ కాలనీ లో నివసించే ఆటో రిక్షా డ్రైవర్ వేణు ముదిరాజ్ అనే 50 ఏళ్ల వ్యక్తి గత వారం మరణించాడు.
సాధారణ అనారోగ్యంతోనే ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన భార్య రెండు సంవత్సరాల కిందట మరణించింది. వేణు కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని తమ్ముడు అతని ఇంటికి సమీపంలోనే ఉంటాడు. అతను మరణించగానే ఆ విషయాన్ని హైదరాబాద్ లోని వారి బంధువులందరికి ఫోన్ ద్వారా తెలిపారు.
అయితే లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎవరూ రాలేకపోయారు. దాంతో వేణు అంత్యక్రియలను ఆనందనగర్ కాలనీలోనే ఉన్న ఆయన తమ్ముడు, ఇంటి పక్క వారు చేపట్టారు. అదే కాలనీలో ఉండే మొహమ్మద్ మజీద్ అనే ఆప్ పార్టీ లీడర్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఆయనతో బాటు నలుగురు కార్యకర్తలు కూడా వచ్చారు. వారంతా తాము కూడా మృతదేహాన్ని కొద్ది సేపు ఎత్తుకుంటామని అడగడంతో వేణు బంధువులు అంగీకరించారు.
దాంతో మజీద్, అతని కార్యకర్తలు భుజం మార్చుకున్నారు. వారు భుజం మార్చుకుని సెల్ ఫోన్ లో ఫొటోలు తీసుకున్నారు. తర్వాత వేణు బంధువులు మళ్లీ భుజం మార్చుకుని వేణు అంత్యక్రియలను సమీపంలోని శ్మశానంలో నిర్వర్తించి ఇంటికి వెళ్లిపోయారు. అయితే మరునాడు పత్రికల్లో మజీద్ పేరుతో వార్త వచ్చింది.
ఆనంద్ నగర్ కాలనీలో ఒక హిందువు మరణిస్తే సాటి హిందువులు ఎవరూ రాలేదని, అతను కరోనాతో మరణించాడని అందరూ భయపడ్డారని ఆ సమయంలో అక్కడే ఉన్న ముస్లింలు అతని అంత్యక్రియలు నిర్వర్తించారని మజీద్ సోషల్ మీడియాలో ఫొటో తో సహా ప్రచారం చేయడంతో అదే నిజమని నమ్మిన పత్రికలు ఆ వార్తను యధాతధంగా ప్రచురించాయి.
పత్రికలు ప్రచురించిన వార్త చూసిన మంత్రి కేటీఆర్ గంగా జమునా తహజీత్ హైదరాబాద్ లో హిందూ ముస్లింల మధ్య ఎలాంటి అంతరాలు లేవు అంటూ ట్విట్టర్ లో చెప్పారు. హిందూ ముస్లింలు కలిసి ఉంటారు అన్నంత వరకూ కరెక్టే కానీ హిందువులు ఎవరూ వేణు అంత్యక్రియలకు రాలేదని, కరోనా అంటే భయపడ్డారని, ఆ సమయంలో ముస్లింలు ధైర్యంగా ముందుకు వచ్చారని చెప్పడం వాస్తవ విరుద్ధమని కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఈ మేరకు వారు ఒక న్యాయవాదిని కూడా కలిసి తాము సంబంధిత వ్యక్తిపై పరువునష్టం దావా వేస్తే ఎలా ఉంటుందని అడిగారు. ఇదే విషయాన్ని ఆ న్యాయవాది ట్విట్టర్ లో పేర్కొన్నారు.