సంఘర్షణ విధానాన్ని మానుకోని సామరస్యంతో మెలిగినప్పుడే సమాజంలో శాంతి నెలకొనడంతో పాటు త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందని మమత వైద్య, విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ శాసన సభ, శాసన మండలి సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. మమత వైద్య విద్యా సంస్థల రజతోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మమత సంస్థలు ప్రజా సంస్థలని, ప్రజల సంస్థలని అనేక ఒడుదొడుకులు ఎదురైనా ప్రజల తోడ్పాటుతో నిలబెట్టగలిగామన్నారు.
లాభం కోసం సంస్థలను ఏర్పాటు చేయడం కానీ, నిర్వహించడం కానీ జరగడం లేదని కేవలం సేవాభావంతోనే సంస్థలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సంస్థ ఏర్పాటైన కొద్ది కాలానికే అనేక మంది వైద్య విద్యా సంస్థలను నిర్వహించడం సాధ్యం కాదు తప్పుకోండి అని సూచించారని అయినా అనేక మంది తమకు దన్నుగా నిలిచారని ఈ సందర్భంగా వారితో పాటు మమత సంస్థల డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
దివంగత పెద్దలు చేకూరి కాశయ్య, ఉడతనేని సత్యం లాంటి వ్యక్తులు అనేక సూచనలు చేశారన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ కాలంలో సంస్థ అనేక విషయాలలో విజయాలు సాధించడమే కాకుండా పురోభివృద్ధి సాధించి ఒక చారిత్రాత్మక సంస్థగా నిలిచిందని పువ్వాడ తెలిపారు. సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలనే ఏకైక లక్ష్యమే మమత వైద్య సంస్థలకు కారణమన్నారు.
కొందరు తామేదో సహకరించినట్లు అభూత కల్పనలతో ప్రచారం చేసుకుంటున్నారని అందులో నిజం లేదన్నారు. ప్రతి యేటా వందలాది మంది ప్రతిభతో కూడిన వైద్యులను అందించడమే గాక ప్రతి రోజు 1000 మంది రోగులకు వైద్య సాయం అందిస్తున్నామని పువ్వాడ తెలిపారు.
జిల్లా అభివృద్ధికి అనేక మంది ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా తోడ్పాటునందించారని ఇదే సమయంలో ఇంకా గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, పేదలకు మరిన్ని సౌకర్యాలు సమకూర్చాల్సి ఉందని ఆ దిశగా ఆలోచన చేయాలని పువ్వాడ సూచించారు.
తన 85వ పుట్టిన రోజు సందర్భంగా పువ్వాడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ సభలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మమత సంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ, మమత సంస్థల డైరెక్టర్లు పువ్వాడ విజయలక్ష్మి, పువ్వాడ వసంతలక్ష్మి, నరేన్, నయన్ రాజ్, జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.