రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేస్తానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. మోత్కూరులో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోనే తన పయనమని, ఆయనతోనే జాతీయ పార్టీలో చేరతామని, నాలుగైదు రోజుల్లో ఏ పార్టీలో ఎప్పుడు చేరేది ప్రకటిస్తామన్నారు.
తుంగతుర్తి నుంచే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారని ప్రశ్నించగా తాను తుంగతుర్తి, కంటోన్మెంట్, చేవెళ్ల, స్టేషన్ ఘనపూర్ స్థానాల్లో ఒకస్థానం నుంచి పోటీచేయాలనుకోగా తుంగతుర్తి నుంచే విజయ అవకాశాలు ఉన్నాయన్నారు. దాంతోనే తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో తనకు మంచి అనుబంధం ఉన్నాయని, తుంగతుర్తిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎంపీ వెంకట్ రెడ్డి మద్దతు కోరతానన్నారు.స్థానికుడు, కులం తెలంగాణ ఉద్యమకారునిగా అవి తనకు వర్తించవన్నారు. తెలంగాణ తెచ్చిన దాంట్లో కేసీఆర్ ఎంతగాకొట్లాడారో నేను కూడా అంతే కొట్లాడానని, జనానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే, విద్యార్థులకు తాను నాయకత్వం వహించానన్నారు.
తుంగతుర్తి నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యే కిశోర్ కుమారును ఏ విధంగా ఎదుర్కొంటారని ప్రశ్నకు కేసీఆర్ తో నాకు పోటీ అని, మధ్యలో కిషోర్ లాంటి చిన్నచిన్నవాళ్లను పట్టించుకోనని సమాధానమిచ్చారు. తుంగతుర్తి ప్రజలకు మీరు ఏంచెప్పాలనుకుంటున్నారని అడగ్గా కొట్లాటలు, దాడులు ఉండవని, ప్రశాంత వాతావరణం నెలకొల్పుతానని, ఎవరి పని వారు చేసుకోవాలని, ఒకరి జీవితంలో మరొకరు వేలు పెట్టకుండా ప్రశాంత వాతావరణం తీసుకొస్తానన్నారు.