లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య సూచించారు. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను మానిటరింగ్ చేయాలని ఆయన కోరారు. జిల్లా ప్రత్యేక అధికారులకు, ఇరిగేషన్ ఇంజనీర్స్, తహసిల్దార్ లు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఉండాలని జిల్లా కలెక్టర్ తగు ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి పరివాహక ప్రాంతం చుట్టు పక్కన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. గత పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రమాదాలకు తావు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్1800 425 0520 ప్రజలకు అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.