రేషన్ కార్డు దారులు E-KYC తప్పనిసరిగా చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో తగిన సౌకర్యాలు లేకపోయిన కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డుదారులు E-KYC తప్పనిసరిగా చేసుకోవాలని.. ఇందుకు ఎలాంటి గడువు లేదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయంలో ప్రజల ఆందోళన మాత్రం తీరడం లేదు. E-KYC నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తారని అందరూ నమ్ముతుండటంతో కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి ఆధార్ కేంద్రాలకు వెళ్లి పడిగాపులు పడుతున్నారు. E-KYC చేసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా రేషన్ తీసుకోవచ్చని అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ప్రజల ఆందోళన మాత్రం తీరడం లేదు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన రొంపిచర్లలో మీసేవా కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట చూస్తే ఈ దారుణ పరిస్థితి కళ్లకు కనబడుతున్నది.
రొంపిచర్లలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలోని ఎ.ఓ.చంద్రారెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముందుగా గుంటూరు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి పద్మశ్రీతో ఫోన్ లో మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల,నరసరావుపేట మండల ప్రజలతో పాటు నరసరావుపేట పట్టణ ప్రజలు అందరూ నరసరావుపేటలోని పోస్టాఫీస్ నందు ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రం వద్దకు కొన్నివందల మంది ప్రజలు తమ చంటి బిడ్డలతొ మండుటెండలో సైతం ఇకెవైసీ అప్ డేట్ నిమిత్తం చేరుకోవడంతో అక్కడ కొట్లాటలు,గొడవలు తదితర సంఘటనలు చోటు చేసుకుంటూ అశాంతి వాతావరణం కలుగుతుందని తెలిపారు. అంతేగాకుండా కరోనా విస్తృతంగా సోకే ప్రమాదముందని మండల కేంద్రమైన రొంపిచర్లలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తే ఆ మండల ప్రజలంతా అక్కడే ఆధార్ నమోదు కేంద్రంలో ఇకేవైసీ అప్ డేట్ చేయించుకునేందుకు అవకాశముంటుందని ఇకేవైసీ నమోదుచేయించుకునేందుకు సమయం తక్కువగా ఉందని తక్షణమే రొంపిచర్లలో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రొంపిచర్ల తహసిల్దార్ మరియు డిప్యూటీ తహసిల్దార్ సెలవులో ఉండటంతో ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సతీష్ కుమార్,శ్రీను బాబు,శివ,వాసు తదితరులు పాల్గొన్నారు.
మాదిరాజు రామ్మూర్తి, సత్యంన్యూస్.నెట్