పైలట్ అప్రమత్తతతో భారత వాయుసేన(IAF)కు చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం గుర్తించి పైలట్ పొలాల్లో ల్యాండ్ చేశాడు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. పైలట్ సురక్షితంగా ఉన్నారు. ఈ హెలికాప్టర్ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొన్నారు.
హెలికాప్టర్ లో సాంకేతిక లోపాన్ని సరిచేసి గమ్యస్థానానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాయం చేసేందుకు మరో హెలికాప్టర్ను అక్కడికి పంపారు. భారత దళాల్లో వినియోగిస్తున్న హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత సైన్యానికి చెందిన ధ్రువ్ జమ్మూకశ్మీర్లోని కిశ్త్వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. అనిల్ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి. మార్చిలో అరుణాచల్ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండలా పర్వత ప్రాంతాల్లో ఓ సైనిక హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. అదే నెలలో భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ ముంబయి తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు.