ఆంధ్రప్రదేశ్లో హిందువులకు, హిందూ దేవాలయాలకు, వాటి భూములకు, సనాతన సంప్రదాయాలకు రక్షణ లేకుండా పోయిందని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఢిల్లీలో ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేవాదాయశాఖను తమ గుప్పిట్లో పెట్టుకుని హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన అన్నారు. ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో 150 ఆలయాలపై దాడులు జరిగినా, విగ్రహాలు ధ్వంసమైనా, భూములను ఆక్రమించినా, రథాలను దహనం చేసినా, ఆభరణాలను ఎత్తుకెళ్లినా ఒక్కరినీ పట్టుకోలేదని ఆయన అన్నారు. అంతర్వేదిలో ఒక చర్చికి రెండు అద్దాలు పగిలితే 40 మందిని అరెస్టు చేశారని ఆయన తెలిపారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పద్మనాభస్వామి ఆలయంలో విగ్రహాన్ని ఛిద్రం చేశారని, తూర్పుగోదావరి జిల్లాలో నంది విగ్రహాలను ఎత్తుకెళ్లారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో లక్షల కోట్ల విలువైన సింహాచలం ఆలయ భూములను విజయసాయిరెడ్డి అనుచరులు ఆక్రమిస్తున్నారని ఆయన తెలిపారు.
జగన్మోహన్రెడ్డి బావ అనిల్ కుమార్ బహిరంగ సభల్లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని స్వామి తెలిపారు. మంత్రులు కొడాలి నాని, అనిల్ యాదవ్లు హిందూ సంప్రదాయాలను వెక్కిరించేలా మాట్లాడుతున్నాఎవరూ చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
హిందూ ఆలయాలు, సంస్కృతి మీద దాడులపై పార్లమెంటులో గళం విప్పినందుకు రఘురామకృష్ణరాజుకు ఆశీస్సులు, అభినందనలు అందజేస్తున్నాం అని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.