ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జనచైతన్య ట్రస్ట్ తరుపున పలువురు యువకులు రక్తదానం చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం లోని కిమ్స్ హాస్పిటల్ లో అత్యవసర వైద్య సేవలు పొందుతున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ప్రముఖ వ్యక్తికి అత్యవసర పరిస్థితుల్లో బి+ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా హుజూర్ నగర్ జనచైతన్య ట్రస్ట్ సభ్యులు వంశీ,పారా సాయి,శివశంకర్ లను సంప్రదించారు.
వెనువెంటనే స్పందించిన ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్ తన మిత్రులతో మాట్లాడి హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లి రక్తదానం చేయించారు.
ట్రస్టు సభ్యులు ఫోన్ చేయగానే వెంటనే మంచి మనసుతో స్పందించి బ్లడ్ డొనేషన్ చేసిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన షేక్ ముస్తఫా, యరగాని విశ్వనాధ్,కొమ్ము అశోక్ లకు జన చైతన్య ట్రస్టు తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవ సందర్భంగా ఒక నిండు ప్రాణాన్ని కాపాడినందుకు తమకు సంతోషంగా ఉన్నదని, రక్తదానానికి కులాలు అడ్డుగోడలు కావని అన్నారు.
జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేసే అవకాశం తమకు కల్పించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్