ముంపు ప్రాంత బాధితులకు వరద సహాయం అందజేతపై ప్రజలకు ఇంకా ఎక్కడ స్పష్టమైన హామీ లభించడం లేదు. తొలుతగా వరద నగదు సహాయాన్ని స్వయంగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందించారు. ఇది కాస్త బెడిసి కొట్టడంతో తీవ్ర విమర్శలపాలైన ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గి మీసేవా ద్వారా అందించే వెసులుబాటును కల్పించింది. ఇక్కడ కూడా ప్రజలకు నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మీరంటే మీరే వరద సహాయాన్ని ఆపాయని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న విషయం విదితమే. అనంతరం 7 నుంచి వరద సహాయం అందుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 7న జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మీసేవాల ద్వారా వరద సహాయం అందదని మీసేవా కేంద్రాలకు రావొద్దని క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా అందజేస్తామని ప్రకటించారు.
నగదు సహాయం అందుతుందా? లేదా?
ఈ నేపథ్యంలో ఓ వైపు 8వ తేదీ నుంచి వరద సహాయం ఇంతమందికి, అంతమందికి ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అని పత్రికా ప్రకటనల్లో చూస్తున్నామని తమకు ఎప్పుడు అందుతుందని, అసలు వరద సహాయం ఎలా అందుతోందని వరద బాధితుల్లో పలు అనుమానాలు రెకేత్తుతున్నాయి. అసలు అందుతున్నాయా? లేదా? అనే మీమాంస కూడా ప్రజలను వేధిస్తోంది.
సరైన సమాధానం ఎవ్వరి వద్దా లేదు?!
కాగా పత్రికల్లో సహాయం అందుతుందని ఎలా వెల్లడవుతుందనేది? ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ అధికారిని అడిగినా వరద సహాయంపై సరైన సమాధానం లభించడం లేదనే వాదనలున్నాయి. క్షేత్ర స్థాయి అధికారులు ఏ ప్రాతిపదికన వరద సహాయాన్ని అందజేస్తున్నారు. ఇళ్ళకు వెళుతున్నారా? లేక ఇంతకుముందు రేషన్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్లలో జమ చేసినట్లు చేస్తున్నారా? లేక మరి ఇంకేమైనా పద్ధతిని అనుసరిస్తున్నారా? అనే విషయాలపై ఆయా అధికారుల వద్ద కూడా సమాధానం లేకపోవడం గమనార్హం.
మరోమారు సహాయం అందజేయడంలో విఫలమేనా?
ఈ నేపథ్యంలో వరద సహాయం అందితే అందినట్లు లేకుంటే లేనట్లు? ఏది ఏమైనా నిజమైన వరద బాధితులకు సహాయం అందజేయడంలో కాస్త అధికార యంత్రాంగం, ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైనట్లేననే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
బాధితులపై ప్రజాప్రతినిధుల ప్రకోపం
ఇక్కడ ఇన్ని అనుమానాలు తలెత్తుతుంటే.. మరో వైపు వరద సహాయంపై స్థానిక ప్రజాప్రతినిధులను అడగడానికి వెళుతున్న బాధితులపై ఆయా నేతల ప్రకోపాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ దయతలచి బాధితులకు వరద సహాయం అందజేస్తుంటే అందరికీ అందజేస్తారా? ఏం తమాషాలు చేస్తున్నారా? అనే సమాధానాలు సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే చేయడం గమనార్హం.
ఏం మునిగిపోయిందని అనుచరులకు, బంధుగణాలకు ఇచ్చారు?
కాగా ఈయన సమాధానాలపై స్థానికుల ద్వారా ఘాటుగానే విమర్శలు వస్తున్నాయి. మరీ పార్టీ నేతల ఇళ్లకు, వారి వారి అనుచరుల, బంధుగణాల ఇళ్లకు ఏం తప్పిపోయిందని (మునిగిపోయిందని) ముందే నగదు సహాయాన్నిఅందజేశారనే ప్రశ్నలకు మాత్రం ప్రజాప్రతినిధుల వద్ద సమాధానం లేదనే చెప్పాలి.