ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెప్టెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు గుంటూరు, విజయవాడ లలో హెచ్ఆర్సీ క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి సంపర వెంకట రమణ మూర్తి తెలిపారు. ఈ మేరకు కమిషన్ వారు ఆదేశాలు ఇచ్చారని ఆయన ప్రకటించారు.
ఈ క్యాంపు కోర్టు లో కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, కమిషన్ సభ్యులు (జుడీషియల్) దండే సుబ్రహ్మణ్యం, కమిషన్ సభ్యులు (నాన్ జుడీషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాత పాల్గొని ఆయా తేదీల్లో మానవ హక్కుల ఉల్లంఘన/పరిరక్షణ లకు సంబంధించిన కేసులో విచారణ మరియు నూతన కేసుల స్వీకరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 26, 27 తేదీ లలో కమిషన్ వారి పరిశీలనలో వున్న గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కేసుల విచారణలు గుంటూరు లోని జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో క్యాంపు కోర్టు నిర్వహణ జరుగనున్నది.
అదేవిధంగా సెప్టెంబర్ 28, 29,30 తేదీల్లో విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల కేసుల విచారణలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్యాంపు కోర్టుకు సంబంధించిన ఇతర వివరముల కోసం క్యాంపు కోర్టు నోడల్ ఆఫీసర్ /కమిషన్ విభాగాధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ 9440788389, ఎన్. సురేష్ బాబు లను 9951992046 / 08518 248248, కేసులకు సంబంధించిన వివరాల కోసం ఈ నెంబర్ లలో సంప్రదించవచ్చని వారు కోరారు.