చిన్న వయసులోనే ప్రేమలో పడి ఆ విషయం బయట పడటంతో ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో సంతగుడిపాడులో జరిగింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక సంతగుడిపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో ఉండి హైస్కూల్ లో 9వ తరగతి చదువుతుంది. కర్లకుంట గ్రామానికి చెందిన గుంజి రమేష్ అనే వ్యక్తితో ఆ బాలిక ప్రేమలో పడింది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్కూల్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో స్కూల్ విరామ సమయంలో ఆమె, రమేష్ లు అరగంట సేపు గడిపారు. పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్దినీలు ఆ ఇంటికి దగ్గర వారికి కాపలాగా ఉన్నారు. విరామ సమయం అయిపోయినా ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చి ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. చివరికి విషయం బయటపడింది.
దాంతో ఎవరూ లేని సమయంలో ఆ బాలిక ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న చుట్టూ ప్రక్కల ఇళ్ళవారు, గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి వచ్చారు. అనంతరం సమాచారం తెలుసుకున్న నరసరావుపేట డిఎస్పీ విజయభాస్కరరావు, ఎస్ ఐ సురేష్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఫ్యాన్ కు వేలాడుతున్న బాలికను చూసి అమ్మమ్మ, తాతయ్య లు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనకు కారకుడైన గుంజి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సిహెచ్ సురేష్ తెలిపారు.