పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారత్ నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పిఎంఎల్ (ఎన్) పార్టీ ఉపాధ్యక్షురాలు మరియమ్ నవాజ్ ఆరోపించారు.
పది ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన లాంగ్ మార్చ్ నేడు ఇస్లామాబాద్ చేరుకున్నది. ఇస్లామాబాద్ లోని ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ ప్రదర్శనను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్ లోని బిజెపి కి చెందిన నాయకుడు ఇందర్ దోసాంజీ నుంచి ఇమ్రాన్ ఖాన్ కు పెద్ద ఎత్తున నిధులు సమకూరాయని ఆమె ఆరోపించారు.
అదే విధంగా ఇజ్రాయిల్ కు చెందిన బార్రీ సీ.చెనాప్స్ నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ పెద్ద ఎత్తున నిధులు తీసుకున్నారని ఆమె అన్నారు.
మొత్తం 23 రహస్య ఎకౌంట్లలోకి ఈ నిధులు వచ్చి చేరాయని వీటిని కనిపెట్టి వెలికి తీయడంలో పాకిస్తాన్ లోని రాజ్యాంగ సంస్థలు విఫలమయ్యాయని ఆమె అన్నారు.
ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా భారత్, ఇజ్రాయిల్ కు చెందిన కొన్ని కంపెనీల నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ కు నిధులు అందాయని ఆమె తెలిపారు.
ఎన్నికల సంఘం ఈ అంశంపై తగిన విచారణ జరపడంలేదని, విచారణను కావాలనే తాత్సారం చేస్తున్నదని ఆమె అన్నారు.
అందుకే ఎన్నికల సంఘానికి బాధ్యతను గుర్తు చేయడానికి ఈ లాంగ్ మార్చ్ నిర్వహించినట్లు ఆమె తెలిపారు.